Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఇరిగేషన్ శాఖ
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 457.60 మీటర్లకు చేరగా, గరిష్ట నీటి నిల్వ మట్టం 458 మీటర్లుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగితే రానున్న 24 గంటల్లో లేదా ఒకటి, రెండు రోజుల్లో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.
నీటి మట్టం నిర్దేశిత స్థాయికి చేరితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. వరద నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేసే అవకాశముందని తెలిపారు. రెవెన్యూ, పోలీసు శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి, పరివాహక ప్రాంత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు.
నది, వరద కాలువ పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి హెచ్చరించారు. పశువులు, గొర్రెలు తదితర మూగజీవులను కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. చేపలు పట్టేవారు, గొర్రెల కాపరులు, రైతులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే ముందు మరో ప్రత్యేక హెచ్చరిక జారీ చేసి, గేట్లు ఎత్తే సమయం, విడుదల చేసే నీటి పరిమాణాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
