Nagamani Malligari April 7, 2026Video Conference
పరిశ్రమల స్థాపన పనులు వేగవంతం చేయాలి…
కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.
ఏ. సిరి పరిశ్రమల యాజమానులకు సూచించారు. మంగళవారం జిల్లాలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల పురోగతిపై సంబంధిత యాజమాన్యాలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల నిర్మాణ పనుల ప్రగతి, పూర్తి చేసే గడువులు, ఎదురవుతున్న సమస్యలపై యాజమానులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పరిశ్రమల ప్రతినిధులు స్పందిస్తూ, పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని, జిల్లా పరిపాలన నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పరిశ్రమల అభివృద్ధి ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. సమావేశంలో ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్ బాబు పాల్గొన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పరిశ్రమల యాజమానులు కూడా హాజరయ్యారు.

