Nagamani Malligari September 2, 2026prabhanews.com
వైఎస్సార్ ఆశయాలే కాంగ్రెస్కు స్ఫూర్తి..
కారేపల్లిలో ఘనంగా వర్ధంతి వేడుకలు
కారేపల్లి, ఆంధ్రప్రభ : పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.
వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కారేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ప్రజాసేవను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు మాట్లాడుతూ రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం తదితర రంగాలకు ఆయన అందించిన ప్రాధాన్యతతో ఎంతోమంది సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు.
వైఎస్సార్ ఆశయాలే కాంగ్రెస్ శ్రేణులకు స్ఫూర్తి అని, ప్రజల కోసం పనిచేయడం, పేదలకు అండగా నిలవడమే మహానేతకు అందించే నిజమైన నివాళి అని రాంబాబు అన్నారు. వైఎస్సార్ చూపిన ప్రజాసేవా మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనహృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన వైఎస్సార్ సేవలను ఎప్పటికీ మరువబోమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు బానోత్ హీరాలాల్ నాయక్, మేదరి వీర ప్రతాప్, ఆంగోత్ మత్రు నాయక్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు పోలగాని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, అడ్డగోడ ఐలయ్య, సురేందర్ మనియార్, భీముడు నాయక్, మల్లెల నాగేశ్వరరావు, యాకూబ్ ఆలీ, వినోద్ నాయక్, తాజుద్దీన్, హనీఫ్, నాగులు, మజీద్ పాషా (షేర్), షఫీ, జగ్గయ్య, అదెర్ల రాములు, తొగర శ్రీను, రవి నాయక్, మల్లేష్ యాదవ్, దేవ్ సింగ్, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు.
