Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
ఆపదలో ఉన్న వారికి ఎల్ఓసీ వరం లాంటిది : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ప్రభుత్వం అందిస్తున్న ఎల్ఓసీ ద్వారా భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమలు, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు.
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎల్ఓసీ వరం లాంటిదని పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రుద్రనగర్ వీధికి చెందిన సిద్ధమప్ప కుమార్తె వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్ఓసీని హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు ఎల్ఓసీ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నామని చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
