Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామ పరిధిలోని పెద్దమ్మకాడి తండాను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న సూచించారు.
మంగళవారం ఆయన బడా భీమ్గల్, పెద్దమ్మకాడి తండా గ్రామాలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సామూహిక ఇంకుడు గుంతను పరిశీలించారు. పెద్దమ్మకాడి తండాలో రైతు పొలంలో నిర్మిస్తున్న వ్యవసాయ నీటి కుంట పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సమీపంలో నిర్మించిన నీటి సంరక్షణ నిర్మాణం, సామూహిక ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా మరిన్ని నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సాయన్న సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఆదర్శ గ్రామం రూపకల్పనలో భాగంగా పెద్దమ్మకాడి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో గంగుల సంతోష్కుమార్ను కోరారు.
అనంతరం ఐకేపీ సిబ్బందితో శ్రీనిధి, బ్యాంకు అనుసంధాన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత చేయూత అందేలా బ్యాంకు అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణతో పాటు మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్కుమార్, ఏపీఎం ప్రమీల, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, సాంకేతిక సహాయకులు, ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు రాహుల్, మమత, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
