Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
జైనూర్, ఆంధ్రప్రభ: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
గ్రామ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయితే విద్యార్థులకు స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆత్రం లక్ష్మణ్రావు, ఉప సర్పంచ్ ఆత్రం భీంరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారాసింగ్, గ్రామ పెద్దలు ఆత్రం జగన్నాథ్, భీంరావు, సామాజిక కార్యకర్త ఆత్రం శంకర్ కొలాం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
