Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సాహసమే స్వర్ణంగా మారింది..

Pavan Chandragiri August 5, 2026

  • కామన్వెల్త్‌లో సాక్షి చౌధరి సంచలనం..

కామన్వెల్త్ గేమ్స్ 2026కి ముందు తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఫలించింది..

నిఖత్ జరీన్, మీనాక్షి హూడాల వంటి స్టార్ బాక్సర్లను అధిగమించి కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం.. ఇప్పుడు ఆసియా క్రీడలపై గురి…

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కామన్వెల్త్ గేమ్స్‌లో 2026 భారత మహిళా బాక్సర్ సాక్షి చౌధరి స్వర్ణ పతకం సాధించన సంగతి తెలిసిందే. అయితే ఈ గెలుపు వెనుక ఒక కీలక నిర్ణయం దాగి ఉంది. 54 కిలోల విభాగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించిన ఆమె, కెరీర్‌లో కీలకమైన సమయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయం… బంగారు పతకంగా మారింది. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ 51 కిలోల విభాగానికి మారి.. అందరినీ ఆశ్చర్యపరిచిన సాక్షి, గ్లాస్గో వేదికగా భారత జెండాను రెపరెపలాడించింది.

కెరీర్‌ను మార్చిన నిర్ణయం..

2026 ప్రారంభంలో సాక్షి తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు 54 కిలోల విభాగంలో పోటీపడుతున్న ఆమె, 51 కిలోల విభాగానికి మారింది. ఇందుకు కారణం భారత బాక్సర్ ప్రీతి పవార్ ఇప్పటికే 54 కిలోల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ కోటా సాధించడమే. అయితే కొత్త విభాగంలో ఆమెకు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హూడా వంటి బలమైన ప్రత్యర్థులు ఎదురయ్యారు. జాతీయ ట్రయల్స్‌లో ఈ ఇద్దరినీ ఓడించిన సాక్షి… భారత జట్టులో స్థానం దక్కించుకుంది. అక్కడి నుంచే కామన్వెల్త్ గేమ్స్ విజయానికి బాట పడింది.

గ్లాస్గోలో స్వర్ణ యాత్ర

కామన్వెల్త్ గేమ్స్ మహిళల 51 కిలోల విభాగంలో సాక్షి అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలి పోటీలో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకానెలేపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. అక్కడ కెనడా బాక్సర్ అంబర్ జేన్ వాల్‌ను మట్టికరిపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తుది పోరులోనూ అదే దూకుడు కొనసాగించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

కోచ్ చెప్పిన రహస్యం

51 కిలోల విభాగంలోకి మారాలన్నది పూర్తిగా అన్నీ పణంగా పెట్టి తీసుకున్న (make-or-break) నిర్ణయమని సాక్షి కోచ్ ఛోటే లాల్ యాదవ్ తెలిపారు. ఒత్తిడి పెరగకుండా ఉండేందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. సాక్షికి అద్భుతమైన స్టామినా, దూకుడు, అత్యుత్తమ 'లెఫ్ట్ జాబ్' (left jab) నైపుణ్యం ఉన్నాయని, శిక్షణ సమయంలో ఆమె పురుష బాక్సర్లతో సమర్థవంతంగా పోటీ పడిందని ఆయన వెల్లడించారు.

ఇంకా మెరుగవ్వాలని మాజీ కోచ్ సూచన

భారత మహిళల మాజీ ప్రధాన కోచ్ భాస్కర్ భట్ కూడా సాక్షి ప్రదర్శనను ప్రశంసించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస దాడులతో పోరాడిందని, ఆమె ఫిట్‌నెస్‌, కాళ్ల బలం గణనీయంగా పెరిగాయని అన్నారు. అయితే పంచ్‌లను మరింత బలంగా అనుసంధానం చేయడం, మోచేతిని అనవసరంగా ఉపయోగించే అలవాటును తగ్గించుకుంటే ప్రపంచ స్థాయిలో మరింత విజయాలు సాధించే అవకాశం ఉంటుందని సూచించారు.

వ్యవసాయ కుటుంబం నుంచి..

కాగా, 2003 సెప్టెంబర్ 22న హర్యానాలోని భివానీ జిల్లా ధనానా గ్రామంలో జన్మించిన సాక్షి చౌధరి వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచిన ఆమె 2012లో బాక్సింగ్‌ను ప్రారంభించింది. తొలి రోజుల్లో జగదీష్ సింగ్ వద్ద శిక్షణ పొందిన సాక్షి, అనంతరం పాటియాలాలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థలో మెరుగైన శిక్షణ పొందింది. ప్రస్తుతం ఆమె భారత సైన్యంలో హవిల్దార్‌గా సేవలందిస్తోంది.

భారత మహిళా బాక్సింగ్‌లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాక్షి చౌధరి మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, పదిసార్లు జాతీయ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భారత సైన్యంలో హవిల్దార్‌గా సేవలందిస్తున్న ఆమె క్రమశిక్షణ, కఠోర శ్రమతో యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.

చిన్న వయసులోనే ప్రపంచ విజేత

సాక్షి ప్రతిభ చిన్న వయసులోనే వెలుగులోకి వచ్చింది. 2015లో తైపీ వేదికగా జరిగిన ప్రపంచ యువజన, జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 2017లో జరిగిన ప్రపంచ యువజన మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2018లో బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ యువజన ఛాంపియన్‌షిప్‌లో 57 కిలోల విభాగంలో కూడా స్వర్ణం గెలిచి తన స్థాయిని నిరూపించింది. అనంతరం ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, 2025 ప్రపంచ బాక్సింగ్ కప్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

ఇప్పుడు ఆసియా క్రీడలపై గురి

కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణంతో సాక్షి చౌధరి భారత మహిళా బాక్సింగ్‌లో కొత్త స్టార్‌గా అవతరించింది. ఇప్పటికే ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను నిరూపించిన ఈ యువ బాక్సర్ ఇప్పుడు ఆసియా క్రీడలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జోరు కొనసాగితే భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికపై కూడా భారతదేశానికి పతకం అందించే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2026 స్వర్ణ పతక విజేతగా సాక్షి చౌధరి భారత మహిళా బాక్సింగ్‌లో అరుదైన స్థానం సంపాదించింది. భారత సైన్యంలో హవిల్దార్‌గా దేశసేవతో పాటు రింగ్‌లో దేశ గౌరవాన్ని నిలబెడుతున్న ఆమె ఇప్పుడు ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌పై దృష్టి సారించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News