యుఎన్ : ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్పై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జీలు సహా ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ట్రంప్ సోషల్మీడియా పోస్ట్ తమను ఆందోళనకు గురిచేసిందని సోమవారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆంటోనియా గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ తెలిపారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన అంశాలపై గుటెరస్ స్పష్టంగా ఉన్నారని, ఈ ఘర్షణల నిర్వహణకు తమ బాధ్యతలను పాటించాలని అన్ని పక్షాలన కోరుతున్నారని అన్నారు. దేశ మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేపట్టడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమేనని గుటెరస్ గుర్తుచేశారని అన్నారు. అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయం లేనందున యుద్ధాన్ని ఆపడానికి ఇదే సరైన సమయమని ఆయన పునరుద్ఘాటించారని అన్నారు. ఇటువంటి దాడులను యుద్ధ నేరాలుగా పరిగణించబడతాయా అన్న మీడియా ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. అవి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని, ఒక విషయం నేరమా కాదా అనేది న్యాయస్థానం నిర్ణయించాల్సి వుంటుందని అన్నారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘననని డుజారిక్ అన్నారు.

