భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, భారతదేశపు మొదటి బహిరంగ 'క్వీర్' పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు.
పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరపున ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. సోమవారం ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రభుత్వంలో LGBTQ+ వర్గానికి మొదటిసారిగా ప్రాతినిధ్యం లభించడం సామాజిక మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది.
మేనకా గురుస్వామి రాజ్యాంగ చట్టాల్లో నిష్ణాతురాలిగా గుర్తింపు పొందారు. 2018లో భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులో మేనకా కూడా కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377కు వ్యతిరేకంగా ఆమె చట్టపరమైన పోరాటం చేశారు. కోర్టు గదుల్లో వాదనలు వినిపించే న్యాయవాది స్థాయి నుంచి చట్టసభల్లో చట్టాలను రూపొందించే ఎంపీ స్థాయికి ఎదిగడంతో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
1974లో మేనకా గురుస్వామి హైదరాబాద్లో జన్మించారు. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో లా పూర్తిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి రోడ్స్ స్కాలర్గా బీసీఎల్ (BCL), డి.ఫిల్ (D.Phil) పూర్తి చేశారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్.ఎల్.ఎమ్ (LL.M) పట్టా పొందారు. అంతేకాదు యేల్ లా స్కూల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీ (NYU) లాంటి విద్యాసంస్థల్లో ప్రొఫెసర్గా పనిచేశారు.
2019లో టైమ్ మ్యాగజైన్లో ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ థింకర్ల జాబితాలో మేనకా చోటు దక్కించుకున్నారు. అలాగే ఫారిన్ పాలసీ మ్యాగజైన్ సైతం ఆమెను టాప్ 100 గ్లోబల్ థింకర్లలో ఒకరిగా గుర్తించింది. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడే మేనక.. చట్టసభలలో సామాజిక మార్పుకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

