భారత మహిళల క్రికెట్ స్టార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఏషియన్ గేమ్స్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై మెరుపు బ్యాటింగ్తో విరుచుకుపడిన ఆమె, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా అవతరించింది.
న్యూజలాండ్ దిగ్గజ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉన్న 4,758 పరుగుల ఆల్ టైమ్ రికార్డును దాటేసి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించింది.
ఈ నాకౌట్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన స్మృతి మంధాన ఆరంభం నుంచే బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి దాదాపు 200 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టింది. పవర్ ప్లే ఆఖరి బంతికి ఔట్ అయింది. షెఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్కు కేవలం 6 ఓవర్లలోనే 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు అదిరిపోయే పునాది వేసింది.
స్మృతి మంధానకు ఈ మధ్యకాలంలో ఇది రెండో అతిపెద్ద మైలురాయి. కేవలం కొన్ని రోజుల క్రితమే భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న 10,868 అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును దాటేసి, అన్ని ఫార్మాట్లలో కలిసి భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు టీ20ల్లో ప్రపంచంలోనే ఏకైక టాప్ రన్ స్కోరర్గా నిలిచి తన సత్తా చాటింది.
మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లు..
స్మృతి మంధాన (భారత్) - 4,788 పరుగులుసుజీ బేట్స్ (న్యూజిలాండ్) - 4,758 రన్స్
హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) - 4,287 పరుగులు
చమరి ఆటపట్టు (శ్రీలంక) - 4,282 రన్స్
సూఫీ డివైన్ (న్యూజిలాండ్) - 3,817 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. షెఫాలీ వర్మ (100 నాటౌట్, 9 సిక్సర్లు) తొలి టీ20ఐ సెంచరీతో భారత్ 195/4 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కేవలం 15.4 ఓవర్లలోనే 81 రన్స్కు ఆలౌట్ అయింది.

