సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్.. ఐపీఎల్ 2027 సీజన్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై అతడి స్వయంగా హింట్ ఇచ్చాడు. భవిష్యత్తో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉందని.. దీంతో పనిభారం దృష్ట్యా.. ఐపీఎల్ 2027కు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు.. వచ్చే 18 నెలలు కీలకం కానుంది. ఈ గ్యాప్లో ఆస్ట్రేలియా జట్టు.. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్, భారత్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ 2027 ఆడాల్సి ఉంది. ఒకవేళ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఆడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్టుకు కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమిన్స్.. ఈ టోర్నీలు అన్నింట్లో ఆడాలని భావిస్తున్నాడు. దీంతో అవసరమైతే ఐపీఎల్ 2027కు దూరమయ్యేందుకు సిద్ధమయ్యాడు.
"వచ్చే ఏడాది ఏదో ఒక దశలో నేను కచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే అది దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్లు లేదా వన్డే ప్రపంచకప్ మాత్రం కాదు. సమయం వచ్చినప్పుడు నేను నా ఐపీఎల్ ఫ్రాంచైజీ (సన్రైజర్స్ హైదరాబాద్)తో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే దీనిపై నేను ఇంతకంటే ఎక్కువ క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే పరిస్థితులు మారవచ్చు లేదా గాయాలు కూడా కావచ్చు" అని పత్రికతో మాట్లాడుతూ కమిన్స్ వ్యాఖ్యానించాడు.
కాగా ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరించాడు. కమిన్స్ వచ్చాక అతడే సారథ్య పగ్గాలు చేపట్టాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ టాప్-4లో నిలిచింది. అయితే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. వచ్చే సీజన్లో కమిన్స్ అందుబాటులో లేకపోతే.. ఇషాన్ కిషన్ పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

