Priyank Kharge: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పోరాటంలో ఆరెస్సెస్ ఎలాంటి పాత్ర పోషించిందని ఆయన ప్రశ్నించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన 500 మంది కాంగ్రెస్ నేతల పేర్లను తాను గర్వంగా చెప్పగలనని, అదే విధంగా ఆరెస్సెస్ నుంచి కనీసం 50 మంది త్యాగధనుల పేర్లనైనా ఆ సంస్థ బయటపెట్టగలదా అని సవాల్ విసిరారు. దేశ విభజన అనంతరకాలంలో తలెత్తిన మత ఘర్షణలకు ఆరెస్సెసే ప్రధాన కారణమని ఆరోపించారు. అయితే, ఆరెస్సెస్ అనేది చట్టబద్ధంగా రిజిస్టర్ కాని సంస్థ కాబట్టి దానిని నేరుగా నిషేధించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ స్థలాల వినియోగంపై కొత్త బిల్లు మరియు ఆరెస్సెస్ శాఖలు
ప్రభుత్వ ప్రాంగణాలు, పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల వినియోగాన్ని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఒక నూతన బిల్లును తెస్తున్నట్లు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, మైదానాలు, పార్కుల్లో నిర్వహిస్తున్న ఆరెస్సెస్ శాఖల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన ఏ ఒక్క సంస్థను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని, అత్యున్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు, ఆదేశాలకు చట్టబద్ధత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు తమ సంస్థ కార్యకలాపాలను ఎవరి ఇళ్లల్లోనో లేదా సొంత కార్యాలయ ప్రాంగణాల్లోనే జరుపుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో బీజేపీ నేతలకు తనపై విపరీతమైన ‘ప్రియాంక్-ఫోబియా’ పట్టుకుందని ఎద్దేవా చేశారు.
Priyank Kharge: బీజేపీ నేత బీఎల్ సంతోష్ కౌంటర్ రియాక్షన్
ప్రియాంక్ ఖర్గే చేసిన విమర్శలపై బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది ప్రజల ప్రగాఢ విశ్వాసంతోనే ఆరెస్సెస్ నిస్వార్థంగా పనిచేస్తోందని, దానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవసరమే లేదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో అల్లర్ల బారిన పడిన అంతులేని హిందువులకు ఆరెస్సెస్ అండగా నిలిచి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. కేవలం ఉప్పు సత్యాగ్రహం, చరఖాకే పరిమితం కాకుండా ఎంతోమంది సాహసోపేత యువకులు, విప్లవ వీరుల అలుపెరగని త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు.

