Telangana RTC: ప్రయాణికులకు టికెట్ ఆదాయానికి అదనంగా ఇతర మార్గాల్లో నాన్-ఫేర్ రెవెన్యూ పెంచుకోవడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరంలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇన్ఫోటైన్మెంట్ తెరలను ఏర్పాటు చేస్తోంది.
ఇందుకోసం రూట్వేవ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా హయత్నగర్-2 డిపోకు చెందిన 10 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ తెరల పనితీరు, ప్రకటనల ద్వారా సమకూరే ఆదాయం, అలాగే ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను ఆర్టీసీ పరిశీలించనుంది. ప్రయోగం విజయవంతమైతే నగరంలోని ఇతర డిపోలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ సాంకేతికతను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also : Ramachander Rao House Arrest: బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హౌస్ అరెస్ట్!
Metro-style information in RTC buses… TG RTC’s new decision.
Telangana RTC: హయత్నగర్-పటాన్చెరు మార్గంలో ప్రయోగం
నగరంలో రద్దీగా ఉండే లాంగ్రూట్లలో ఒకటైన హయత్నగర్-పటాన్చెరు మార్గాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఈ రూట్లో నడిచే 10 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పటికే డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇలాంటి స్క్రీన్లను ప్రధానంగా వినోదం, వాణిజ్య ప్రకటనల కోసం మాత్రమే వినియోగించగా.. ప్రస్తుతం ప్రయాణికులకు ఉపయోగపడేలా మెట్రో రైళ్ల తరహాలో రాబోయే బస్ స్టాప్ వివరాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
బస్సు ప్రయాణించే మార్గంలోని ముఖ్యమైన స్టేజీల వివరాలను ముందుగానే డిజిటల్ తెరల్లో పొందుపరిచారు. దీంతో కొత్తగా ఆ మార్గంలో ప్రయాణించే వారు, నగరంలోని రూట్లపై పెద్దగా అవగాహన లేని ప్రయాణికులు తమ గమ్యస్థానం ఎప్పుడు వస్తుందో సులభంగా తెలుసుకుని, సరైన స్టాప్లో దిగేందుకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రజా సమాచార వేదికగా డిజిటల్ తెరలు
డిజిటల్ తెరలను కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం చేయకుండా.. ప్రజలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించే వేదికగా కూడా ఉపయోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు, ఆర్టీసీ అందిస్తున్న ఆఫర్లు, ప్రయాణికులకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఈ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.
నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాటిని ప్రజా సమాచార వేదికలుగా వినియోగించడంతో పాటు, వాణిజ్య ప్రకటనల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా టికెట్ ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా సంస్థకు నాన్-ఫేర్ రెవెన్యూను పెంచి, ఆర్టీసీని మరింత ఆర్థికంగా బలోపేతం చేయాలని యోచిస్తున్నారు.
హైదరాబాద్లో 24 గంటలూ బస్సులు.. నేటి నుంచి 6 రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం

