Ambedkar Jayanti TGSRTC: ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు "సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : సిబ్బంది సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం : నాగిరెడ్డి"
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) మంగళవారం ఆర్టీసీ కళాభవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప తదితరులు పాల్గొని అంబేద్కర్కు అంజలి ఘటించారు.
Read Also:Medak: కౌడిపల్లిలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

Ambedkar Jayanti TGSRTC
ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఒక సమాజం ఎంత పురోగతి సాధించిందనేది ఆ సమాజంలోని మహిళలు సాధించిన అభివృద్ధిని బట్టే తాను కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను ప్రతి ఒక్కరూ మనసా వాచా స్మరించుకోవాలని గుర్తు చేశారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి అంబేద్కర్ అందించిన అత్యున్నత రాజ్యాంగమే కారణమని ఆయన కొనియాడారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించి, రాజ్యాంగ రక్షణ అందించిన మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరులుగా జీవించడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం పట్ల మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉందని నాగిరెడ్డి గారు స్పష్టం చేశారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ కూడా అనవసర ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే సంస్థ యొక్క ప్రధాన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జేడీ శ్రీమతి సి.నర్మద, ఈడీ లు శ్రీ. సిహెచ్.వెంకన్న, శ్రీ. ఖుస్రో షా ఖాన్, శ్రీ. రాజశేఖర్, శ్రీ.సాల్మన్, ఎఫ్ఏ శ్రీమతి విజయపుష్ప, సిటీఎం ఏం & సి శ్రీ .శ్రీధర్, సిపిఎం శ్రీమతి ఉషాదేవి, సీఈ(ఐటి) శ్రీమతి శ్రీదేవి, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత, ఎస్సీ, ఎస్టీ యూనియన్ చైర్మన్ రాజయ్య నాయక్, , పలువురు ఆర్ఎం లు, అధికారులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
అంబేద్కర్ ఆశయాలే బీఆర్ఎస్కు స్ఫూర్తి: పద్మా దేవేందర్ రెడ్డి ఘన నివాళి!

