Gautam Adani: భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతో పాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ జడ్జి అంగీకరించలేదు.
అసలు ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో మరింత స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదికను సమర్పించాల్సిందిగా అమెరికా న్యాయ శాఖను (DOJ) కోర్టు ఆదేశించింది.

జులై 13 లోగా నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశం
బ్రూక్లిన్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న జస్టిస్ డిపార్ట్మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా ఉందని, అందులో ఎలాంటి బలమైన కారణాలు లేవంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలు, కారణాలతో కూడిన సమగ్ర నివేదికను జులై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను న్యాయమూర్తి ఆదేశించారు.
Gautam Adani: అసలు ఏంటా వివాదం?
భారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదం కోసం ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని, అలాగే అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై 2024లో అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉంది.
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కేసుపై మరింత సమయం, వనరులను కేటాయించలేమని పేర్కొంటూ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జస్టిస్ డిపార్ట్మెంట్ భావించింది. జూన్ 24న అదానీ తరపు న్యాయవాదులు కూడా ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును అధికారికంగా కొట్టివేయాలని కోర్టును కోరారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి పూర్తి వివరణ కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
సివిల్ వివాదాల పరిష్కారానికి అదానీ అంగీకారం
ఈ క్రిమినల్ కేసు ప్రక్రియ ఇలా ఉండగా, దీనికి సమాంతరంగా నడుస్తున్న సివిల్ వివాదాల పరిష్కారానికి అదానీ గ్రూప్ అంగీకరించింది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల మేర సివిల్ సెటిల్మెంట్ కింద చెల్లించే ప్రతిపాదనలు కోర్టు అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఇవి కాకుండా, ఇరాన్ నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికి గాను అదానీ ఎంటర్ప్రైజెస్ అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.

