Bihar crime: బీహార్లోని ససారం మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) విమల్ కుమార్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. టాయిలెట్ బ్రేక్ ఇవ్వడానికి నిరాకరించారనే చిన్న కారణంతోనే డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, ఈ హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ మృతుడి భార్య చేసిన ఆరోపణలు కేసును సంచలనాత్మక మలుపు తిప్పాయి.
పోలీసుల కథనం ప్రకారం, ఆదివారం రాత్రి ఈవో విమల్ కుమార్ పట్నాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో టాయిలెట్ కోసం కారు ఆపాలని డ్రైవర్ మిథిలేష్ కుమార్ కోరగా, దానికి విమల్ కుమార్ నిరాకరించారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన డ్రైవర్, కారులో ఉన్న ఇనుప రాడ్తో విమల్ కుమార్పై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.
Car driver beats official to death with a rod-here is what happened on the highway.
Bihar crime: డ్రైవర్ కట్టుకథలు… విచారణలో అసలు నిజం!
హత్య అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మిథిలేష్ యత్నించాడు. గుర్తుతెలియని వ్యక్తులు తన బాస్పై దాడి చేశారని మొదట కథ అల్లాడు. అయితే, విచారణలో అతను చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. తీవ్ర పని ఒత్తిడి, ఆఫీసర్తో తరచూ జరిగే గొడవల వల్లే సహనం కోల్పోయి ఈ దారుణానికి పాల్పడినట్లు డ్రైవర్ అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేపై భార్య సంచలన ఆరోపణలు
కాగా, ఈ హత్యకు పని ఒత్తిడి మాత్రమే కారణం కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ మృతుడి భార్య బబిత సంచలన ఆరోపణలు చేశారు. దేహ్రీ ఎల్జేపీ (రామ్ విలాస్) ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ సింగ్ (సోను సింగ్) తన భర్తను రూ. 50 లక్షలు, ఆ తర్వాత రూ. 25 లక్షలు ఇవ్వాలని తీవ్రంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే ప్లాన్ చేసి తన భర్తను హత్య చేయించారని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే సోను సింగ్ తీవ్రంగా ఖండించారు. విమల్ కుమార్తో తనకు ఎలాంటి వ్యక్తిగత లేదా ఆర్థిక వివాదాలు లేవని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ప్రస్తుతం దాడికి ఉపయోగించి డ్రైవర్ పడేసిన ఇనుప రాడ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఆధారాలు సేకరించిన తర్వాతే కేసుపై తుది నిర్ధారణకు వస్తామని మగధ్ రేంజ్ ఐజీ వికాస్ వైభవ్ తెలిపారు.
'హోయిహీ సోయి జో రామ్ రచీ రఖా': బ్రిజ్ భూషణ్ సింగ్ మొదటి స్పందన

