High Court On Land Acquisition In The Capital : అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ (CRDA) పరిధిలో చేపట్టిన భూసేకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గుంటూరు జిల్లా పరిధిలోని మూడు మండలాల్లో భూసేకరణకు సంబంధించి అధికారులు జారీ చేసిన 57 ప్రాథమిక, తుది నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ నిడమర్రుకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, పిల్ విచారణార్హతపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Lunar Mission : లూనార్ మిషన్ కు ఎంపికైన AP విద్యార్థిని.. మంత్రి లోకేశ్ ప్రశంసలు
High Court On Land Acquisition In The Capital
High Court On Land Acquisition In The Capital : పిటిషనర్కు ఈ భూసేకరణతో ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటి?
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులు స్వయంగా కోర్టుకు రాలేని పరిస్థితిలో ఉన్నందున వారి తరఫున ఈ పిల్ దాఖలు చేశామని తెలిపారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత ఆస్తి హక్కులు, భూసేకరణ వంటి అంశాల్లో మూడో వ్యక్తి దాఖలు చేసే ప్రజాహిత వ్యాజ్యం ఎలా నిలుస్తుందని నిలదీసింది. పిటిషనర్కు ఈ భూసేకరణతో ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏంటని ప్రశ్నించింది. అభ్యంతరాలు ఉన్న రైతులు, భూయజమానులు ఇప్పటికే వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారని అడ్వకేట్ జనరల్ (AG) కోర్టుకు తెలిపారు. దీనిని ప్రస్తావించిన ధర్మాసనం, బాధితులు స్వయంగా పిటిషన్లు వేసినప్పుడు అదే అంశంపై పిల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ, “కోర్టులు రాజకీయ వేదికలు కావు. న్యాయవాదులు కోర్టు ఆఫీసర్లుగా న్యాయస్థానానికి నిజాయతీగా సహకరించాలి” అని పేర్కొంది. రాజకీయం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్లను వాడకూడదని పరోక్షంగా హెచ్చరించింది. ప్రస్తుతానికి పిల్ విచారణార్హతపై సమగ్ర వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. పిల్కు విచారణార్హత ఉందో లేదో తేలిన తర్వాతే అసలు భూసేకరణ నోటిఫికేషన్ల చట్టబద్ధతపై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.

