Chandrababu Naidu: "దేశం గర్వించేలా అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ప్రతి ఒక్కరికీ చారిత్రాత్మక అవకాశం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సచివాలయంలో సోమవారం నాడు రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ (L&T), షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ (NCC) వంటి దేశీయ దిగ్గజ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో పాల్గొంటున్న కాంట్రాక్టు సంస్థలు వ్యాపార దృక్పథంతో కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప బ్రాండ్ను సాధిస్తున్నామనే బాధ్యతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "హైదరాబాద్ను మించిన ఆధునిక హంగులతో, దేశానికే గర్వకారణంగా అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా ఇది నిలవబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు. పనుల వేగాన్ని మరింత పెంచి, నిర్దేశించుకున్న గడువు కంటే ముందే పూర్తి చేయాలని కంపెనీలను ఆదేశించారు. ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అవి రాష్ట్రానికి శాశ్వత ఐకానిక్ చిహ్నాలుగా నిలిచిపోవాలని స్పష్టం చేశారు.
రూ.50,999 కోట్ల విలువైన పనుల ప్రగతి.. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ!
ప్రస్తుతం అమరావతి పరిధిలో దాదాపు రూ.50,999 కోట్ల విలువైన వివిధ రకాల ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ లేఅవుట్లతో పాటు కీలక ప్రభుత్వ భవనాల పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ రంగంలో 26,924 మందికి పైగా కార్మికులు, 5,140 భారీ యంత్రాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఈ సమీక్షలో వెల్లడించారు. భవిష్యత్తులో నగరానికి వరద ముప్పు లేకుండా కొండవీటి వాగు, పాలవాగుల వెడల్పు పనులు కూడా చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టేసిందని, తాము అధికారంలోకి వచ్చాక పనులను మళ్లీ గాడిలో పెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల మట్టి, నీటితో పునీతమైన ఈ ప్రాంత పునర్నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు శక్తులు ప్రయత్నించినా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతామన్నారు. ప్రతి రెండు నెలలకొకసారి తానే స్వయంగా పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు. రాజధాని నిర్మాణాలు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

