Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగు దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మత్తు పదార్థాల నియంత్రణ వల్ల రాష్ట్రంలో నేరాల శాతం ఏకంగా 14 శాతం మేర తగ్గిందని ఆమె గణాంకాలతో సహా వెల్లడించారు.

‘ఈగల్’ టాస్క్ఫోర్స్ అద్భుత ఫలితాలు
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 'ఈగల్' (EAGLE) టాస్క్ఫోర్స్ క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తోందని హోంమంత్రి కొనియాడారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఇప్పటివరకు సుమారు 1.20 లక్షల కిలోల గంజాయిని పట్టుకుని, నిబంధనల ప్రకారం దహనం చేసినట్లు పేర్కొన్నారు. కేవలం గంజాయిని సీజ్ చేయడమే కాకుండా, అంతరాష్ట్ర స్మగ్లర్ల వెన్నువిరిచేలా దాదాపు రూ. 24 కోట్ల విలువైన వారి ఆస్తులను ప్రభుత్వం అటాచ్ (జప్తు) చేసిందని వివరించారు.
యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న మత్తు మాఫియాపై రాబోయే రోజుల్లో మరింత ఉక్కుపాదం మోపుతామని అనిత హెచ్చరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు డ్రగ్స్ సమాచారాన్ని రహస్యంగా చేరవేసేందుకు వీలుగా 'ఈగల్' ప్రత్యేక వెబ్సైట్తో పాటు ఒక టోల్ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు హోంమంత్రి వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

