AstraZeneca India: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ ఫార్మా, బయోటెక్ దిగ్గజ సంస్థలైన ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ (Qure.ai) సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.
దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ సెంటర్ ఏర్పాటు

ఈ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థ అమరావతిలో ‘ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రధానంగా ఊపిరితిత్తులు మరియు రొమ్ము కేన్సర్ రోగులకు అవసరమైన అధునాతన జన్యు పరీక్షలు (Genomic Tests), బయోమార్కర్ టెస్టింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల కేన్సర్ బాధితులకు మరింత కచ్చితమైన, వేగవంతమైన చికిత్స అందించేందుకు మార్గం సుగమమవుతుంది.
AstraZeneca India:సిఎం చంద్రబాబు సమక్షంలో జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్కు శ్రీకారం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం స్థాయి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఒప్పందాల వల్ల ఏపీ ఆరోగ్య, వైద్య పరిశోధనా రంగాలు సరికొత్త మైలురాయిని చేరుకుంటాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

