Amarnath Yatra Bus Accident: జమ్మూ కాశ్మీర్లో ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో దాదాపు 39 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన యాత్రికులు మరియు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
లోయలో పడిన యాత్రికుల బస్సు
గందర్బల్ జిల్లాలోని హరిగనివాన్ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గందర్బల్ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఎస్-మోడ్ హరిగనివాన్ మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రహదారి పక్కకు జారి కందకంలో (లోయలో) పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు నుజ్జునుజ్జైంది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. భారత సైన్యం (Indian Army), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యాత్ర పోలీస్ సిబ్బందితో పాటు 2 అస్సాం రైఫిల్స్, 21 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. స్థానిక ప్రజలు కూడా క్షతగాత్రులను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. గాయపడిన యాత్రికులను సురక్షితంగా బయటకు తీసి ప్రాథమిక చికిత్స నిమిత్తం కంగన్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్లోని పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Amarnath Yatra Bus Accident: కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ అతివేగం లేదా నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగినప్పటికీ అమర్నాథ్ యాత్ర యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్ర మార్గంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అధికారులు మరింత కఠినతరం చేశారు. ప్రయాణ సమయంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని యంత్రాంగం సూచించింది.
రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల అధినేత నున్నా సురేశ్ దుర్మరణం!

