Chittoor District Crime: భర్త వివాహేతర సంబంధం ఓ నిండు సంసారంలో చిచ్చురేపింది. కట్టుకున్నవాడు మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన తర్వాత పిల్లలు అనాథలు కాకూడదనే ఆవేదనతో ఘోర నిర్ణయం తీసుకుంది.
కన్నబిడ్డలకు కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా భూమండలపురానికి చెందిన సుబ్రహ్మణ్యం, దివ్య దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గీత (7), హర్షిత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా సుబ్రహ్మణ్యం మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై భార్య దివ్య ప్రశ్నించినప్పుడల్లా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. క్రమంగా కుటుంబాన్ని విస్మరించి, పూర్తిగా ఆ మహిళతోనే జీవించడం ప్రారంభించాడు.
Read Also: Pune Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం
Chittoor District Crime
Chittoor District Crime: కూల్ డ్రింక్లో విషం కలిపి ఘాతుకం
గత శుక్రవారం సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన సమయంలో దివ్య మళ్లీ అతని ప్రవర్తనను నిలదీసింది. ఈ క్రమంలో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారని భావించింది. దీంతో బయట నుంచి తెచ్చిన కూల్ డ్రింక్లో విషం కలిపింది. తల్లి తమ కోసమే తెచ్చిందని ఎంతో సంతోషంగా ఆ శీతల పానీయాన్ని తాగిన చిన్నారులు కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు వచ్చి గిలగిల కొట్టుకున్నారు. పిల్లల పరిస్థితి చూసిన అనంతరం దివ్య కూడా అదే విషం కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ముగ్గురినీ తక్షణమే చికిత్స నిమిత్తం తమిళనాడులోని ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో బాలుడు హర్షిత్ శుక్రవారం నాడే ప్రాణాలు కోల్పోగా, బాలిక గీత శనివారం నాడు చికిత్స పొందుతూ కన్నుమూసింది. తల్లి దివ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. కళ్ల ముందే ఇద్దరు పసివాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దివ్య తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Epaper: epaper.vaartha.com

