Anantapur: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం నగరంలో ఒక్కసారిగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, వై.
విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో కోర్టు రోడ్డు (Court Road) రణరంగంగా మారింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైసీపి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Read also:Uravakonda Lorry Accident: ఉరవకొండలో ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవ దహనం
అసలు ఏం జరిగిందంటే..?
రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన తాడిపత్రి (Tadipatri) కి బయల్దేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలు తమ అనుచరులు, వైసీపి కార్యకర్తలతో కలిసి సిద్ధమయ్యారు. తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనంతపురం కోర్టు రోడ్డు వద్ద భారీగా బారికేడ్లను అడ్డుగా ఉంచి వైసీపి నేతలు, కార్యకర్తల వాహన శ్రేణిని పోలీసులు నిలిపివేశారు. తాడిపత్రి వెళ్లకుండా తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని మండిపడుతూ మాజీ ఎమ్మెల్యేలు అనంత, విశ్వేశ్వరరెడ్డిలు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వైసీపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Anantapur: భారీగా స్తంభించిన ట్రాఫిక్ - అదుపులోకి తెచ్చే ప్రయత్నం

నగరంలో అత్యంత కీలకమైన కోర్టు రోడ్డుపై వైసీపి నేతలు ధర్నాకు దిగడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఆందోళన విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నేతలు వెనక్కి తగ్గలేదు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించిన పోలీసులు, వైసీపి నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

