Nagarkurnool Fire Accident: నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో గుడి ముందున్న ఐదు దుకాణాలు మంటల్లో పూర్తిగా కాలిబూడిదయ్యాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎండీ గౌస్ అనే వ్యాపారి దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Nagarkurnool Maddimadugu Fire Accident
నిమిషాల్లోనే బూడిదైన ఐదు వ్యాపార దుకాణాలు
మొదట ఒక షాపులో మొదలైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న నేనావత్ బోడి, శ్రీను, వెంకటేష్, మల్లేష్ గౌడ్ దుకాణాలకు వ్యాపించాయి. గ్రామస్థులు వెంటనే స్పందించి నీళ్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘోర ప్రమాదంలో శ్రీను అనే చిన్న వ్యాపారి కుటుంబం సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడింది. చేతికొచ్చిన వ్యాపారం కళ్ల ముందే కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Nagarkurnool Fire Accident: ఫైర్ సిబ్బంది ఆలస్యంపై స్థానికుల ఆగ్రహం
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినా వారు తీవ్ర నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ లేరని, వస్తున్నామని చెబుతూ కాలయాపన చేయడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి వచ్చేసరికే దుకాణాలు పూర్తిగా సర్వనాశనమయ్యాయి. ఒక్కో వ్యాపారికి దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మే 25 నుండి తెలంగాణలో మహిళా వారోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

