Dailyhunt
అర్ధరాత్రి వేళ ఊపిరి తీసిన మూఢనమ్మకం..

అర్ధరాత్రి వేళ ఊపిరి తీసిన మూఢనమ్మకం..

వార్త 1 week ago

• చేతబడి నెపంతో దంపతుల దారుణ హత్య…

• అనాథలైన ముగ్గురు పిల్లలు…

Srikakulam Crime: శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం అంగారక గ్రహం వైపు అడుగులు వేస్తున్నా, మారుమూల పల్లెల్లో అజ్ఞానం ఇంకా చీకటి రాజ్యమేలుతోంది.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చిన్న రాజాపురం గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న ఘోరకలి నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. తన కుటుంబానికి కలుగుతున్న అనారోగ్యాలు, కష్టాలకు చేతబడే కారణమని బలంగా నమ్మిన ఒక వ్యక్తి, అనుమానంతో ఇద్దరు అమాయక దంపతులను అత్యంత కిరాతకంగా బలితీసుకున్నాడు. ఈ అమానవీయ ఘటనతో ఒక కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది.మంగళవారం అర్ధరాత్రి వేళ చిన్న రాజాపురం గ్రామానికి చెందిన ఇల్లంగో, ఆయన భార్య జ్యోతి తమ నివాసంలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన తోటయ్య అనే వ్యక్తి కత్తితో వారి ఇంట్లోకి చొరబడ్డాడు.

Read Also:Komatireddy Raj Gopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

Srikakulam Crime: అనాథలైన పిల్లలు

నిద్రపోతున్న వారిపై పగతో విచక్షణారహితంగా దాడి చేయడంతో, తల మరియు మెడ భాగాల్లో తీవ్ర గాయాలై ఆ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు తన కుటుంబ సభ్యుల వరుస అనారోగ్యాలకు ఈ దంపతుల మంత్రతంత్రాలే కారణమని మనసులో పగ పెంచుకుని, పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.ఈ దారుణ హత్యలతో ఆ దంపతుల పిల్లలు అనాథలయ్యారు. వివాహమైన కుమార్తె సుజాతతో పాటు, ఇంకా లోకం తెలియని 16 ఏళ్ల కిసాయి, 8 ఏళ్ల రామరాజు కళ్లముందే తల్లిదండ్రులు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోతున్నారు.

 నిందితుడు సవర తోటయ్య

ఆ చిన్నారుల రోదనలు గ్రామస్తులను కన్నీటి పర్యంతం చేశాయి. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.హత్య అనంతరం పరారైన నిందితుడు తోటయ్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ రక్తపాతం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అక్షరాస్యత కలిగిన ఈ కాలంలో కూడా అజ్ఞానం, మూఢనమ్మకాలు ప్రాణాలను బలితీసుకోవడం పట్ల జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అవగాహన లోపం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ చిన్న రాజాపురం విషాద ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha