Dailyhunt
అసలు ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

అసలు ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

వార్త 5 days ago

ప్రజాస్వామ్య పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోలైన ఓటు ఎవరికి పడింది? విజేత ఎవరు? అనే ఉత్కంఠకు తెరదించే ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పక్కా నిబంధనల మధ్య జరుగుతుంది.

ఓట్ల లెక్కింపు రోజున ఉదయం ఎనిమిది గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది, సర్వీస్ ఓటర్లు వేసిన ఈ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలుగా కట్టి లెక్కిస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అభ్యర్థులు లేదా వారి తరపున నియమించబడిన కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో, భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తీసుకువస్తారు. ప్రతి టేబుల్ వద్ద సీళ్లు సరిచూసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపడతారు.

Read Also : విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే?

ఈవీఎం రౌండ్ల లెక్కింపు – ఫలితాల వెల్లడి

ఈవీఎంలలోని ఫలితాలను లెక్కించేటప్పుడు ముందుగా ‘టోటల్’ బటన్ నొక్కి పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను పోలింగ్ రోజు నమోదైన వివరాలతో సరిపోలుస్తారు. ఆ తర్వాత ‘రిజల్ట్’ బటన్ నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కంట్రోల్ యూనిట్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఒక కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఉంటాయి. అంటే 14 ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండు ముగిసినట్లు లెక్క. అయితే ఓటర్లు లేదా అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో 28 ఈవీఎంలను ఒక రౌండుగా పరిగణించి ప్రక్రియను వేగవంతం చేస్తారు. ప్రతి రౌండు ముగియగానే రిటర్నింగ్ అధికారి ఆధిక్యంలో ఉన్న అభ్యర్థి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు.

వీవీప్యాట్ స్లిప్పుల సరిపోలిక.. తుది తీర్పు

ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి వీవీప్యాట్ (VVPAT) స్లిప్పుల లెక్కింపు నిర్వహిస్తారు. లాటరీ పద్ధతిలో నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి, ఆయా వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్పులను లెక్కిస్తారు. ఈ స్లిప్పుల సంఖ్య ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోలితేనే ఆ ఫలితాన్ని తుది ఫలితంగా నిర్ధారిస్తారు. ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్లు అందరూ సంతృప్తి చెందిన తర్వాత, రిటర్నింగ్ అధికారి అభ్యర్థి విజయాన్ని ధృవీకరిస్తూ ఫామ్-21సీ జారీ చేస్తారు. ఈ పకడ్బందీ విధానం వల్లే ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో నమ్మకం చెక్కుచెదరకుండా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha