Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ!

బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ!

వార్త 2 weeks ago

Bandaru Dattatreya: నస్పూర్, మే 30: రాజకీయాలు సమాజం, దేశ శ్రేయస్సు కోసం మాత్రమే చేయాలని, వ్యక్తిగత అవసరాలకు, పేరు ప్రతిష్టల కోసం చేయరాదని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని సింగరేణి అతిథి గృహంలో శనివారం ఆయన ‘ప్రజల కథే – నా ఆత్మకథ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నైతిక విలువలు, నీతి నిజాయితీ, సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేసే వారు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజకీయం కమిషన్లు, డబ్బు సంపాదించుకోవడానికి ఒక వృత్తిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కోసం పనిచేయాలని సూచించారు. బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంతో అధికారంలోకి రావడం శుభపరిణామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి ఫలితాలే రావాలని ఆకాంక్షించారు. ఇందుకు భాజపా శ్రేణులు, నాయకులు ఇప్పటి నుంచే తీవ్రంగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Read also:Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబం నుంచి తాను వచ్చానని, తన తల్లి ఈశ్వరమ్మ ఎంతో కష్టపడి తనను పెంచిందని బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎవరూ తమ మూలాలను మర్చిపోవద్దని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీలో అతి సామాన్యుడిగా ఉన్న నరేంద్ర మోడీ అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు.

Bandaru Dattatreya: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చూస్తుంటే బాధగా ఉందని బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలవాలని సూచించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు గొనె శ్యాంసుందర్ రావు, దుర్గం అశోక్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామాంజనేయులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha