Bandla Ganesh: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి వేలం వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. బకాయిల వసూలు కోసం బ్యాంకు చేపడుతున్న తదుపరి రికవరీ చర్యలకు అనుమతినిచ్చింది. ఈ వేలాన్ని రద్దు చేస్తూ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది.

read also: Telangana Police Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 7 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆమోదం
పౌల్ట్రీ ఫామ్ రుణం.. జూబ్లీహిల్స్ ఆస్తి తాకట్టు
ఈ వివాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు భాగస్వాములుగా ఉన్న ‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ నుండి భారీగా రుణాలు తీసుకుంది. ఈ అప్పుకు గ్యారెంటీగా జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్లో ఉన్న దాదాపు 500 గజాల నివాస గృహాన్ని బ్యాంకు వద్ద తాకట్టు పెట్టారు. ఈ రుణ ఒప్పందానికి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు వ్యక్తిగత షూరిటీలుగా వ్యవహరించారు.
Bandla Ganesh: సర్ఫేసీ చట్టం కింద వేలం ప్రక్రియ
తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో విఫలం కావడంతో, యూనియన్ బ్యాంక్ అధికారులు సర్ఫేసీ (SARFAESI) చట్టాన్ని ప్రయోగించారు. ఈ క్రమంలో 2019లో సదరు తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో బహిరంగ వేలం నిర్వహించారు. ఆ వేలంలో ఈ నివాస భవనం రూ. 8.51 కోట్లకు అమ్ముడైంది. అయితే, ఈ వేలం చెల్లదంటూ డీఆర్టీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.
డీఆర్టీ ఉత్తర్వులను కొట్టేసిన ధర్మాసనం
యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. బ్యాంకు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. డీఆర్టీ ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేసింది. బ్యాంకు నిర్వహించిన వేలం చట్టప్రకారమే జరిగిందని శుక్రవారం స్పష్టమైన తీర్పునిచ్చింది. హైకోర్టు తాజా నిర్ణయంతో నిధుల రికవరీ విషయంలో యూనియన్ బ్యాంకుకు ఉన్న లీగల్ అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
Epaper: epaper.vaartha.com

