Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో ముస్లింలకు చోటు లేదంటే.. అతడు హిందువే కాదు: మోహన్ భగవత్

భారత్‌లో ముస్లింలకు చోటు లేదంటే.. అతడు హిందువే కాదు: మోహన్ భగవత్

వార్త 3 weeks ago

Mohan Bhagwat: అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన 'ఒకే ప్రపంచం, ఒకే మానవత్వం' అనే ప్రతిష్టాత్మక మత పెద్దల సదస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ముస్లింల ఉనికిపై స్పష్టమైన సానుకూల ప్రకటన చేశారు. భారతదేశంలో ముస్లింలకు ఎటువంటి స్థానం ఉండకూడదని భావించే ఏ వ్యక్తయినా సరే అసలు నిజమైన హిందువు కానేరడని ఆయన తేల్చిచెప్పారు. హిందుత్వం అనేది కేవలం ఒక మతం కాదని, అది ప్రతి మనిషి గౌరవాన్ని, అన్ని మార్గాల సత్యత్వాన్ని గౌరవించే ఒక జీవన విధానమని ఆయన వివరించారు.

2018 నాటి అనుభవాన్ని గుర్తుచేసిన భగవత్

ఈ సదస్సులో భాగంగా 2018 సంవత్సరంలో ఢిల్లీలో తాను నిర్వహించిన ప్రసంగాల పరంపరను మోహన్ భగవత్ మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంతమంది ముస్లిం సోదరులు తనను కలిసి, “మీరు హిందూ సంస్థకు చెందినవారు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు.. మరి భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఈ దేశం నుంచి తరిమేస్తారా?” అని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రశ్నకు తాను సమాధానమిస్తూ, “లేదు, అది మన హిందుత్వం కాదు. ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా, అతను తన హిందూ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయినట్లే” అని స్పష్టం చేసినట్లు సదస్సులో వెల్లడించారు.

Mohan Bhagwat: సత్యం ఒక్కటే – మార్గాలు వేరైనా మానవత్వం ఒక్కటే

నిజమైన హిందూ గుర్తింపునకు మత వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రతి మనిషి సమానత్వాన్ని అంగీకరించడం చాలా ప్రాథమికమని భగవత్ ఉద్ఘాటించారు. అన్ని భిన్నమైన మార్గాలు చివరికి ఒకే పరమ సత్యాన్ని చేరుకుంటాయని నమ్మడమే నిజమైన హిందుత్వమని తెలిపారు. మతాలు, ఆచారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ మానవత్వం మాత్రం ఒక్కటేనని చెప్పే సుదీర్ఘమైన గొప్ప సంప్రదాయం భారతదేశాని సొంతమని ఆయన కొనియాడారు. మానవుల మధ్య ఎలాంటి వివక్షలకు తావులేకుండా అందరినీ సమానంగా చూడటమే ప్రకృతికి అసలైన అలంకారమని పేర్కొన్నారు.

విదేశీ దండయాత్రలను తట్టుకుని నిలిచిన భారతీయ సంస్కృతి

చారిత్రక క్రమంలో జరిగిన అనేక విదేశీ దండయాత్రల వల్ల దేశం తన నాగరికతా సంపదలో కొంత భాగాన్ని కోల్పోయినప్పటికీ, అందరినీ సమానంగా ఆదరించే గొప్ప భారతీయ సంప్రదాయం మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా సజీవంగా ఉందని భగవత్ గుర్తుచేశారు. భారత్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికీ ఆశ్రయం కల్పించే విశాల దృక్పథాన్ని కలిగి ఉందని, అందుకే ఇక్కడ భిన్న వర్గాల ప్రజలు ఎంతో కాలంగా సామరస్యంగా కలిసి జీవిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

మానవ ఐక్యతను కాపాడాల్సిన మత పెద్దల బాధ్యత

సమాజంలో మానవ ఐక్యత భావనను నిరంతరం ప్రజలకు గుర్తుచేయకపోతే అనేక విపరీత ధోరణులు తలెత్తే ప్రమాదం ఉందని మోహన్ భగవత్ హెచ్చరించారు. ఈ దిశగా మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు చొరవ తీసుకొని ప్రజల్లో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భౌతికవాదం, అహంకారం, ఆధిపత్య ధోరణులను నిరోధించగల సామాజిక విలువలను, మంచి అలవాట్లను నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన సూచించారు.

ఖర్గే సభా ప్రాంగణం 'శుద్ధీకరణ' రాజ్యాంగ విరుద్ధం: రాహుల్ గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha