Bilawal Bhutto Zardari: భారతదేశం 'సింధు జలాల ఒప్పందాన్ని' (IWT) తాత్కాలికంగా నిలిపివేయడంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
భారత్తో ఏ రకమైన యుద్ధానికైనా తమ దేశం సిద్ధంగా ఉందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో బిలావల్ మాట్లాడుతూ.. సింధు నది నీటిని భారత్ ఒక రాజకీయ ఆయుధంగా మలచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నదీ జలాలపై తమకున్న హక్కులను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.
ఒప్పందం నిలిపివేతకు దారితీసిన ఉగ్రదాడి
గతేడాది (2025) ఏప్రిల్ 22న పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన అనంతరం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశం నుంచి సాగుతున్న సరిహద్దు ఉగ్రవాదానికి పూర్తిగా చెక్ పెట్టేంతవరకు ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే తేల్చిచెప్పింది. అయితే, ఈ ఒప్పందం ఇంకా రద్దు కాలేదని, ఇప్పటికీ అమలులోనే ఉందంటూ పాక్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దార్ వ్యాఖ్యలను సమర్థిస్తూనే, బిలావల్ భుట్టో ఏకంగా యుద్ధ ప్రకటనలు చేస్తూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.
Bilawal Bhutto Zardari: పాక్ వైఖరిని ఎండగట్టిన భారత నిఘా వర్గాలు
బిలావల్ భుట్టో చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారత నిఘా వర్గాలు ఘాటుగా స్పందించాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడానికి, నీటి నిర్వహణపై అంతర్జాతీయంగా తప్పుడు ప్రచారాలు చేయడానికే పాక్ నేతలు ఇలాంటి నిందాపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని కొట్టిపారేశాయి. ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయం చేయడమే పాక్ వ్యూహమని, వారి ఉగ్రవాద చరిత్రే వారి నిజస్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించాయి. భారత్ ఎప్పుడూ ఒప్పందాలను గౌరవిస్తుందని, అయితే దేశ భద్రతకు, ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే శత్రువులకు తగిన బుద్ధి చెప్పేందుకు తమకున్న అన్ని హక్కులను ఉపయోగించుకుంటామని భారత వర్గాలు స్పష్టం చేశాయి.

