Heavy Rains : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా :
ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు తడుస్తూ స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో పాఠశాల బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు కూడా కష్టంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాగులు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటంతో చిన్నారుల భద్రతపై ఆందోళన మరింత పెరిగింది.

ఈ నేపథ్యంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లల ప్రాణ భద్రతే ముఖ్యమని, వర్షాలు తగ్గిన తర్వాత తరగతులను కొనసాగించాలని వారు కోరుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు తల్లిదండ్రులు, నెటిజన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
వాతావరణ శాఖ కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అవసరం లేకుంటే బయటకు రావద్దని సూచిస్తున్నాయి. వర్షాల తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అయితే ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు వర్తించేలా స్కూళ్లకు సెలవులపై అధికారిక ప్రకటన వెలువడలేదు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

