Lokesh &Ram Mohan Naidu: భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మాణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లపై రాష్ట్ర నారా లోకేష్ అధ్యక్షతన విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం విచ్చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మొదటగా ఎయిర్పోర్ట్ రన్వే, ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎయిర్పోర్ట్ బ్లాక్లో సమీక్ష నిర్వహించారు.
Lokesh &Ram Mohan Naidu: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారుల నివేదిక
సమీక్ష సందర్భంగా వివిధ అంశాల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సమగ్రంగా వివరించారు. ప్రధాన రహదారుల నిర్మాణాలు, భారీ వాహనాల పార్కింగ్ స్థలాలు, బస్సు రూట్లు, ప్రధాన సభా వేదిక కార్యక్రమాలు, ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ గ్యాలరీ, అత్యవసర వైద్య సదుపాయాలు, ఆహుతులకు టిఫిన్ మరియు భోజన ఏర్పాట్లు, అలాగే గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై బాధ్యత కలిగిన అధికారులు వివరణ ఇచ్చారు.
అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పలు కీలక సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలను తీసుకువచ్చే బస్సులన్నీ ఉదయం 9:00 గంటలకల్లా కేటాయించిన పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భోజన పంపిణీ విషయంలో ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు కలగకుండా సులభమైన ప్రణాళికపై అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. అన్ని శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాలవీరాంజనేయస్వామిలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ ప్రతినిధులు మరియు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

