Bihar crime: బీహార్లో అత్యంత దారుణమైన, భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన వదినను గొడ్డలితో దారుణంగా హత్య చేసి, అనంతరం ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు.
ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మృతురాలిని ధర్మేంద్ర కుమార్ భార్య, 25 ఏళ్ల అన్షు దేవిగా పోలీసులు గుర్తించారు.
Brother-in-law hacks sister-in-law to death over delayed meal!
Bihar crime: భోజనం ఆలస్యమైందనే ఆగ్రహంతో దారుణం
నిందితుడు కునాల్ కుమార్ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా పొలాలకు వెళ్లగా, అన్షు దేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన కునాల్ కుమార్ భోజనం అడిగాడు. అయితే, భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు, ఇంట్లోనే ఉన్న గొడ్డలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీయడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల అదుపులో నిందితుడు
ఈ దారుణ నేరం చేసిన తర్వాత కూడా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయకుండా ఇంటి సమీపంలోనే కూర్చొని ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

