Medak News: భూభారతి, రెవెన్యూ సదస్సులు, మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
పారదర్శక రెవెన్యూ పాలన ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
Read Also : Professor Jayashankar 92nd Jayanthi: తెలంగాణ దిక్సూచి జయశంకర్ సార్.. కేటీఆర్
Bhu-Bharathi applications must be resolved quickly: Medak Collector
Medak News: రెవెన్యూ దరఖాస్తుల సమీక్ష, పాఠశాల తనిఖీ
గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ తొలుత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి పెండింగ్ దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వినతుల పరిష్కారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు కూడా పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని వంటశాల, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న విద్య, వసతి, ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, పాఠశాలలను పరిశుభ్రతకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. తరగతి గదుల్లో విద్యార్థినుల అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

వనమహోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
అనంతరం బుజ్రాన్పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, వాటి నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులు సొంతింటి కలను త్వరగా నెరవేర్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతికుమార్, సర్పంచ్ జైపాల్ గౌడ్, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, ఆర్ ఐ నాగరాజు కేజీబీవీ ప్రిన్సిపాల్ విజయ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


