Chakriyala Bonalu Festival: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని చక్రియాల గ్రామంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.
గ్రామానికి చెందిన మహిళలు, యువతీ యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ ఆలయాలను విద్యుత్ దీపాలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు.
మేళతాళాల మధ్య బోనాల ఊరేగింపు
బోనాల పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాల ఘటాలను శిరస్సుపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మేళతాళాల మధ్య సాగిన ఈ ఊరేగింపు గ్రామంలో ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యం (బోనం) సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
Chakriyala Bonalu Festival: పాడిపంటలు వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. గ్రామం అంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి రోగాలు, ఆపదలు రాకుండా ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు. సర్పంచ్ చిన్నరోళ్ల పాటి అనసూయ రాజశేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు మరియు పారిశుధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే బోనాల పండుగను గ్రామ ప్రజలంతా ఐక్యమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు
Epaper: epaper.vaartha.com

