IIT Madras : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2027) దరఖాస్తు ప్రక్రియలో ఐఐటీ మద్రాస్ కీలక మార్పు చేసింది. ఈసారి భారతీయ అభ్యర్థులందరికీ డిజిలాకర్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.
దరఖాస్తు సమయంలో అభ్యర్థుల వివరాలను డిజిలాకర్ నుంచి నేరుగా (IIT Madras) సేకరించే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులు ముందుగానే తమ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసుకోవాలని ఐఐటీ మద్రాస్ సూచించింది.
వెరిఫైడ్ ఐడీ వివరాలు వంటి సమాచారాన్ని :
డిజిలాకర్ ద్వారా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా, వెరిఫైడ్ ఐడీ వివరాలు వంటి సమాచారాన్ని GATE దరఖాస్తులోకి తీసుకోనున్నారు. అయితే డిజిలాకర్లోని ఫొటోను GATE దరఖాస్తు ఫొటోగా పరిగణించరు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో లైవ్ ఫొటో, అవసరమైన తాజా ఫొటోను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా, 'GATE2027' పేరుతో డిజిలాకర్లో ప్రత్యేక ఫోల్డర్లో పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డిజిలాకర్లో కనిపించే వెరిఫైడ్ పత్రాల్లో సరైన వివరాలు ఉన్న గుర్తింపు పత్రాన్ని అభ్యర్థి ఎంపిక చేసుకోవచ్చు. పేరు లేదా పుట్టిన తేదీలో తేడా ఉంటే, సరైన వివరాలు ఉన్న మరో వెరిఫైడ్ ఐడీని ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
GATE 2027లో మరో ముఖ్యమైన మార్పుగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ (RA) పేరుతో కొత్త టెస్ట్ పేపర్ను ప్రవేశపెట్టారు. పరీక్షకు సంబంధించిన సిలబస్లో కూడా కొన్ని మార్పులు చేశారు.
తాజా షెడ్యూల్ ప్రకారం GATE 2027 రిజిస్ట్రేషన్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమైంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు అవకాశం ఉంది. పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు.

