Bengaluru School Student: కర్ణాటకలో ఒక పాఠశాల ఉపాధ్యాయుల ప్రవర్తన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్కూల్లో చేయని తప్పుకు దొంగతనం నింద వేసి, తోటి విద్యార్థుల ముందూ, అందరిముందూ ఉపాధ్యాయులు తీవ్రంగా అవమానించారనే మనస్తాపంతో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా మరసూరు గ్రామంలో ఈ హృదయవిదారక సంఘటన వెలుగుచూసింది.

Bengaluru School Student: ఉరి వేసుకుని ఆత్మహత్య.. ఉదయం వెలుగులోకి..
మరసూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సదరు విద్యార్థిని, గురువారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు బాలిక అపస్మారక స్థితిలో వేలాడుతుండటం గమనించడంతో ఈ ఘోర విషయం వెలుగులోకి వచ్చింది. కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
హృదయవిదారక సూసైడ్ నోట్: “నేను దొంగను కాదు”
పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మహత్యకు ముందు సదరు బాలిక తన చేతిరాతతో ఒక సూసైడ్ నోట్ (Suicide Note) రాసి పెట్టింది. ఆ లేఖలో తన ఆవేదననంతా వెళ్లగక్కింది. పాఠశాలలో తాను రూ.20, రూ.10 దొంగతనం చేసినట్లు ఉపాధ్యాయులు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ నిందను తాను భరించలేకపోతున్నానని పేర్కొంది. ఉపాధ్యాయులు తనను అందరి ముందూ తీవ్రంగా తిట్టారని, ఆ అవమానాన్ని తట్టుకోలేకనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని రాసింది. తాను ఇక జీవించడానికి అర్హురాలిని కానంటూ.. తన తల్లి, తోబుట్టువులకు లేఖలో పదే పదే క్షమాపణలు చెప్పింది. తన మరణానికి తన తల్లికి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని లేఖలో స్పష్టం చేసింది.
కన్నీరుమున్నీరవుతున్న తల్లి.. పోలీసుల లోతైన దర్యాప్తు
బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. “ఇంట్లో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఒకవేళ ఏమైనా ఉంటే నాతో చెప్పేది. స్కూల్లో కొందరు ఉపాధ్యాయులు నా కుమార్తెను ఇబ్బంది పెట్టారని మాత్రమే నాకు తెలిసింది. అయితే ఆ ఉపాధ్యాయులు ఎవరనేది నాకు స్పష్టంగా తెలియదు” అని చెమర్చిన కళ్లతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘోర ఘటనపై సూర్యనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలిక రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ లేఖలోని అంశాలను, హ్యాండ్రైటింగ్ను ధృవీకరిస్తున్నారు. పాఠశాలలో బాలికను మానసికంగా వేధించి, అవమానించిన ఉపాధ్యాయులు ఎవరనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

