Congress Vs BRS : తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రాజేంద్రుడి యుద్ధం గన్పార్క్ అమరవీరుల స్తూపం సాక్షిగా మరోసారి బహిర్గతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావులపై రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
“సవాల్ అంటారు.. తీరా సమయం వచ్చేసరికి సర్దుకొని పోతారు” అంటూ వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్, హరీష్రావులను ఉద్దేశించి ‘డ్రామారావు’, ‘అగ్గిపెట్టెరావు’ అని సరికొత్త నామకరణం చేసిన మంత్రి, వీరిద్దరూ కేవలం ప్రజాకర్షణ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా గన్పార్క్ వద్దకు రాకుండా తోకముడిచారని, సవాళ్లకు వెరసి పారిపోవడం వీరికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

ఫామ్హౌస్ రాష్ట్ర సమితి (FRS) లో ఆధిపత్య పోరు
గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక దోపిడీ, పేరుకుపోయిన అపారమైన అప్పుల మీదే తాము అసెంబ్లీలో శ్వేతపత్రం (White Paper) విడుదల చేసి పూర్తిస్థాయి చర్చకు పెట్టామని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. ఆ సమయంలో నిజాలు ఫేస్ చేయలేక సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత్ రాష్ట్ర సమితి (BRS) కాస్తా ఇప్పుడు ‘ఫామ్హౌస్ రాష్ట్ర సమితి’ (FRS) గా మారిందని విమర్శించారు. కేవలం ఆ పార్టీలో తమ ఉనికిని కాపాడుకోవడానికి, బావ-బావమరుదుల మధ్య సాగుతున్న అంతర్గత ఆధిపత్య పోరు కోసమే తెలంగాణ సమాజాన్ని వాడుకుంటూ ఇలాంటి పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు.

