E20 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ విధానం పేరిట ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల్లోంచి నేరుగా డబ్బులను దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ప్రజల కార్లు, స్కూటర్ల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, ఇది వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. “సాధారణంగా పప్పులో కొద్దిగా నలుపు ఉందంటాం (దాల్ మే కుచ్ కాలా హై).. కానీ ఈ విషయంలో పప్పంతా నల్లగానే ఉంది” అంటూ హిందీ సామెతతో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన సెటైర్లు వేశారు.
E20 Petrolదేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ సన్నాహాలు
E20 ఇంధనం వల్ల వాహనదారులకు మైలేజ్ తగ్గడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన అంశమని, దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న అవినీతిపై క్రమబద్ధంగా పోరాటం చేస్తున్నామని, ఈ క్రమంలో E20 సమస్యను కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి గట్టిగా నిలదీస్తామని తెలిపారు. ప్రజల ఆస్తులను, వాహనాలను నాశనం చేసే ఇటువంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.

