LPG Supply: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడంతో దేశీయంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కమర్షియల్ ఎల్పీజీ వాడకంపై ఇప్పటివరకు విధించిన ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, అలాగే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోవడంతో గ్యాస్ దిగుమతులు సాధారణ స్థితికి చేరుకున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.

హోటళ్లు, చిన్న పరిశ్రమలకు భారీ ఉపశమనం
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను ప్రభుత్వం ప్రస్తుతం 50 శాతం మేర పునరుద్ధరించింది. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా పరిశ్రమలు మరియు ఇతర వాణిజ్య సంస్థలకు ఇంధన కొరత తీరనుంది. గతంలో అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని సాధారణ గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందుకోసం ఎల్పీజీ తయారీకి అవసరమయ్యే C3-C4 గ్యాస్ వనరులను ఇతర రంగాలకు మళ్లించకుండా, పూర్తిగా వంటగ్యాస్ సిలిండర్ల ఉత్పత్తికే కేటాయించింది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు చక్కబడటంతో ఆ పరిమితులను సడలించింది.
LPG Supply: దేశీయ ఉత్పత్తి, పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యం
అంతర్జాతీయ సరఫరా పుంజుకున్నప్పటికీ, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల కంటే తగ్గకుండా చూస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి తోడు, దేశీయ పెట్రోకెమికల్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి C3-C4 వనరుల కేటాయింపులను మరింత పెంచాలని నిర్ణయించింది.
పీఎన్జీ (PNG) విస్తరణే లక్ష్యం
మరోవైపు, పర్యావరణహిత పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) నెట్వర్క్ను వేగంగా విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ గ్యాస్ను వాడుతున్న వాణిజ్య సంస్థలు అదే విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే, పీఎన్జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన ఇతర ప్రాంతాల వినియోగదారులను కూడా దశలవారీగా ఈ గ్యాస్ కనెక్షన్ల వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

