ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తున్నా, ఓటమికి గల కారణాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. 2024 ఎన్నికల్లో తమ ఓటమి సహజంగా జరిగింది కాదని, తెరవెనుక ఏవో అక్రమాలు జరిగాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. “ఎన్నికల పెట్టెలు మార్చడం వల్ల ఓడిపోయామో లేక అర్ధరాత్రి నమోదైన ఓట్ల వల్ల ఓడిపోయామో అర్థం కావడం లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న వైసీపీ వాదనకు బొత్స వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.
Read Also : NTR-NEEL Dragon Shooting Stopped: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్ ?

పరకాల ప్రభాకర్ ఆరోపణల నేపథ్యంలో కొత్త చర్చ
బొత్స తన వ్యాఖ్యలకు మద్దతుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీ వేదికగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏపీలో దాదాపు 3,500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరగడంపై విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి 11:45 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య 4.16 శాతం ఓట్లు నమోదు కావడం వెనుక ఏదో మర్మం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఓటు వేయడానికి పట్టే సమయానికి, నమోదైన ఓట్ల సంఖ్యకు పొంతన లేదంటూ ఆయన చేసిన గణాంక విశ్లేషణను ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు.
కూటమి ఆధిక్యం.. ఎన్నికల సంఘం వివరణ!
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ, ఈ ఫలితాలను జీర్ణించుకోలేక ఈవీఎం ట్యాంపరింగ్ మరియు పోలింగ్ అక్రమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే, పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలను మరియు వైసీపీ విమర్శలను ఎన్నికల సంఘం అధికారులు అప్పట్లోనే ఖండించారు. రాత్రి వేళ పోలింగ్ జరగడం అనేది ఓటర్ల రద్దీ వల్లేనని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, రెండేళ్ల తర్వాత కూడా బొత్స వంటి సీనియర్ నేతలు మళ్లీ పాత అంశాలను తెరపైకి తీసుకురావడం ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నానంటూ వ్యంగ్యంగా కామెంట్స్

