Malla Reddy: తెలంగాణలో విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని సృష్టించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తన నెట్వర్క్ను విస్తరించేందుకు సిద్ధమయ్యారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ‘మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ’ని స్థాపించనున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు లభించాయని ఆయన తిరుమల కొండపై మీడియా సమక్షంలో ప్రకటించారు.

నెరవేరిన చిరకాల కాంక్ష
నిన్న ఉదయం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యా రంగంలో గత 35 ఏళ్లుగా సేవలు అందిస్తున్నానని, తిరుపతిలో ఒక భారీ యూనివర్సిటీని నెలకొల్పాలనేది తన చిరకాల కోరిక అని పేర్కొన్నారు. గత ఏడాది (2025) లోనే ఈ దిశగా అడుగులు వేశానని, కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దయతో ఇప్పుడు ఆ కల సాకారమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Malla Reddy: ఏపీలో ఇప్పటికే కాలేజీల కొనుగోలు
తెలంగాణలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు డీమ్డ్ వర్సిటీలను విజయవంతంగా నడుపుతున్న మల్లారెడ్డి.. గత కొంతకాలంగా పక్క రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే గత ఏడాది తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను దక్కించుకున్నారు. అలాగే విశాఖపట్నంలోనూ మరో కాలేజీని కొనుగోలు చేసినట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను నిర్మించడమే తన అంతిమ లక్ష్యమని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
కొత్త క్యాంపస్ నిర్మిస్తారా?
సాధారణ పాల వ్యాపారిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా అత్యున్నత స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి, ఇప్పుడు తన విద్యా బ్రాండ్ను ఏపీకి పరిచయం చేస్తున్నారు. అయితే, గత ఏడాది తిరుపతిలో కొనుగోలు చేసిన ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే ఈ కొత్త డీమ్డ్ యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తారా? లేక దీని కోసం ప్రత్యేకంగా సరికొత్త క్యాంపస్ను నిర్మిస్తారా? అనే విషయాలపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.

