Electric Vehicles on Subsidy : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో సబ్సీడీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా వేలాది మంది యువత తమ సొంత ఉపాధిని ప్రారంభించుకునే అవకాశం లభించనుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 90 శాతం సబ్సీడీ :
ఈ పథకం కింద రూ.1 లక్షలోపు విలువైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 90 శాతం సబ్సీడీ అందించనున్నారు. అలాగే రూ.4 లక్షల లోపు విలువైన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలకు 70 శాతం సబ్సీడీ ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుంది. దీంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5,016 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 2,508 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి భారీ స్పందన లభించగా, సుమారు లక్ష వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
జిల్లాల వారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన అర్హులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి వాహనాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ పథకం ద్వారా యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గడంతో ఆదాయం పెరగడమే కాకుండా కాలుష్య నియంత్రణకు కూడా ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎస్సీ యువత ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఒక మంచి అవకాశంగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

