Mahabubnagar ATM Theft; మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అత్యంత సాహసోపేతమైన, సంచలన దొంగతనం ఒకటి వెలుగులోకి వచ్చింది. పట్టణం నడిబొడ్డున ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు ఏకంగా ఏటీఎం (ATM) మెషిన్నే పెకలించుకుని ఎత్తుకెళ్లారు.
ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, పోలీసు యంత్రాంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
Read Also: Medak News: నన్ను చులకన చేస్తే మీ పేరు రాసి చనిపోతా: మహిళా కౌన్సిలర్ ఆవేదన
తెలంగాణ చౌరస్తా వద్ద అర్ధరాత్రి దారుణం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కీలకమైన తెలంగాణ చౌరస్తా (Telangana Chowrasta) సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం కేంద్రాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కా స్కెచ్తో వచ్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా అనుమానిస్తున్న కొందరు.. ఏటీఎం సెంటర్లోకి చొరబడ్డారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ముందుగా అక్కడి సీసీ కెమెరాలను (CC Cameras) పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్లు లేదా భారీ పరికరాల సహాయంతో ఏటీఎం మెషిన్ను పునాదులతో సహా పెకలించి, వాహనంలో వేసుకుని పరారయ్యారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి ధరావత్
మంగళవారం ఉదయం ఏటీఎం ధ్వంసమై ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ (SP Janaki Dharavath) ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ (Clues Team), డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ జానకి ధరావత్ మీడియాకు తెలిపారు.
Mahabubnagar ATM Theft: షాద్ నగర్ గ్యాంగ్ పనేనా..? అంతటా తీవ్ర చర్చ
జిల్లా కేంద్రంలో, అది కూడా ప్రధాన కూడలి వద్ద పోలీస్ పెట్రోలింగ్ కళ్లను కప్పి సీసీ కెమెరాలను పగులగొట్టి ఏకంగా మెషిన్నే లేపేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కాగా, ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shadnagar) లో కూడా సరిగ్గా ఇలాంటి తరహాలోనే ఏటీఎంను ఎత్తుకెళ్లిన ఘటన నమోదు కావడం గమనార్హం. దాంతో షాద్ నగర్లో దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాయే మహబూబ్ నగర్లోనూ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందా అనే కోణంలో పోలీసులు గట్టి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణ సరిహద్దుల్లోని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి, రహదారుల వెంబడి ఉన్న ఇతర ప్రైవేట్ సీసీ ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

