Indian Railways : భారతీయ రైల్వేల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై వస్తున్న విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా స్పందించారు.
రైల్వే శాఖ ప్రతిఏటా సగటున 58 కోట్ల ఆహార పొట్లాలు (మీల్స్) ప్రయాణికులకు అందిస్తోందని, అందులో నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు కేవలం 0.0008 శాతం మాత్రమేనని వివరించారు. ఫిర్యాదుల శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయాణికులకు అందించే ఆహార విషయంలో రాజీపడేది లేదని, నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

క్యాటరింగ్ సంస్థలపై కఠిన చర్యలు
రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించని సర్వీసులపై ఐఆర్సీటీసీ (IRCTC) ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గత మూడేళ్ల కాలంలో నిర్వహించిన తనిఖీల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు మొత్తం రూ. 5.13 కోట్ల మేర జరిమానా విధించామని తెలిపారు. అంతేకాకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆరు కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు 54 షోకాజ్ నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. బేస్ కిచెన్లలో సిసిటీవీ (CCTV) కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆహార పొట్లాలపై క్యూఆర్ (QR) కోడ్లు ఉంచడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.

