Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

గండిపేట భూమి కబ్జా కేసు..మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్

వార్త 1 week ago

Bolla Brahmanaidu: సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో కలకలం రేపిన రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తమిళనాడులో అరెస్టయిన ఆయనను పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల లాయర్ల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

 YSRCP Ex MLA Remand

Read also:Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాంచీపురంలో అరెస్ట్.. నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత!

ఈ భారీ భూకుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో శుక్రవారం తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించి, నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక విచారణ జరిపారు. బ్రహ్మనాయుడి అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయనను ఉప్పల్ కోర్టుకు తరలించారు.

Bolla Brahmanaidu: అసలు కేసు ఏమిటి? రూ.1,500 కోట్ల విలువైన భూమిపై కన్ను!

రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా చేజిక్కించుకునేందుకు బొల్లా బ్రహ్మనాయుడు మరికొందరితో కలిసి పెద్ద స్కెచ్ వేశారని గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి మే 23న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అత్యంత ఖరీదైన ఈ ల్యాండ్‌ను కొట్టేయడానికి నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నకిలీ పత్రాల ద్వారా సదరు భూమిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ 10 ఎకరాల విలువ దాదాపు రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ శాసనసభ్యుడైన బ్రహ్మనాయుడు, ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాగా, ఈ మెగా ల్యాండ్ స్కామ్‌కు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha