Tribal Areas Health Policy: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం సహా అన్ని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య శాలల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త హెల్త్ పాలసీని (New Health Policy) తీసుకురానుంది.
ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారికంగా వెల్లడించారు. ఐటీడీఏ (ITDA) పరిధిలో ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా అధునాతన సీటీ స్కాన్ (CT Scan) సేవలను అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో కేవలం జనాభాను ప్రాతిపదికన తీసుకోకుండా, ప్రజలకు ఎంత త్వరగా వైద్యం అందుతుందనే దూరం ఆధారంగా ఆసుపత్రుల అప్గ్రేడేషన్, కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్సీల (PHC) మంజూరు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
Read Also :Hyderabad Crime: మాదాపూర్ లో హత్య : విడాకుల కక్షతోనే ఘాతుకం

డయాలసిస్ సేవలు విస్తరణ – ప్రతి మండలానికి అంబులెన్స్:
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే 7 డయాలసిస్ సెంటర్లు నడుస్తుండగా, భక్తులు మరియు రోగుల సౌకర్యార్థం మరో 4 కేంద్రాలను అదనంగా మంజూరు చేశారు. రోగులు కేవలం 20 నిమిషాల ప్రయాణంతోనే ఈ సేవలు పొందేలా డయాలసిస్ నెట్వర్క్ను అనుసంధానించారు. అత్యవసర సమయాల్లో రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ను కేటాయించారు. అలాగే సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులకు అనుబంధంగా వీటి సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
Tribal Areas Health Policy: వర్షాకాల సీజనల్ వ్యాధులపై ముందస్తు అలెర్ట్
అడవులు, కొండలు, మారుమూల భౌగోళిక పరిస్థితులు గిరిజన ప్రజలకు వైద్యం అందకుండా అడ్డుకాకూడదనే ఉద్దేశంతో గత నెలలోనే ఐటీడీఏ పీవోలతో (ITDA POs) సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాలను ఎక్కువగా వేధించే మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు అటవీ ప్రాంతాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHC) నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీటితో పాటు పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో సరికొత్త హెల్త్ సబ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు.

