Jnaneswari Missing : కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి జూలై 6కి నెల రోజులు. ఈ నెల రోజులుగా ఒకవైపు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా… మరోవైపు, తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగా ఉందనే మాట కోసం ఎదురుచూస్తున్నారు.
పోలీసులు అడవులు గాలించారు. కొండలు, బావులు, చెరువులు వెతికారు. డ్రోన్లు ఎగరేశారు. మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ఎక్కడైనా చిన్నారి కనిపించిందనే సమాచారం వచ్చిన ప్రతిసారీ బృందాలను పంపించారు. జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? ఆమెకు ఏమైంది? నెల రోజులైనా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
ఇప్పటివరకు అన్ని కోణాల్లో దర్యాప్తు
జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో ఇప్పటివరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని పోలీసులు చెబుతున్నారు. మొబైల్ టవర్ డేటా డంప్, కాల్ డేటా విశ్లేషణ, డ్రోన్ సర్వేలు, ట్రాప్ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ పద్ధతులను ఉపయోగించినట్లు తెలిపారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ ఈ కేసును పర్యవేక్షిస్తున్న పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జ్ఞానేశ్వరి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు విషయాలను బీబీసీకి వివరించారు. “అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా పరిశీలించాం. అందులో భాగంగా మాంసం ఉంచిన బొమ్మలను చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో ఏర్పాటు చేసి, ట్రాప్ కెమెరాల ద్వారా గమనించాం. అయితే, ఆ ప్రయోగంలోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు” అని డీఎస్పీ తిలక్ తెలిపారు. ఆదిలాబాద్, బాపట్లతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదన్నారు.
Read Also: Markapuram Marriage Dispute:ఊరేగింపులో 'డ్యాన్స్' రగడ..వివాహం రద్దు చేసిన తండ్రి!
Jnaneswari Missing
Jnaneswari Missing : అటవీశాఖ సహాయం తీసుకుని దర్యాప్తు
పాప ఆచూకీ తెలియకుండా పోయి నెల రోజులైనా… తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పెద్దాపురం డీఎస్పీ తిలక్ చెప్పారు. పాప అదృశ్యమైన ప్రాంతంతో పాటు… అనుమానం ఉన్న ప్రతి ప్రదేశానికి బృందాలను పంపుతున్నట్లు తెలిపారు. పాప కుటుంబం నివాసముంటున్న 40 ఎకరాల పామాయిల్ తోటకు ఆనుకుని ఉన్న ప్రాంతానికి మొత్తం 13 కొండలకు వెళ్లే మార్గాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆ దారుల గుండా ఎవరైనా పాపని తీసుకెళ్లి ఉంటారనే కోణంలో… అటవీశాఖ సహాయం తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తిలక్ తెలిపారు. “పాప ఆచూకీ కోసం పామాయిల్ తోటల్లోకి పనులకు వచ్చే స్థానికులు, ఇతర ప్రాంతాల వారిని ఎప్పటికప్పుడు విచారిస్తూనే ఉన్నాం. పామాయిల్ తోటలతో పాటు దాని చుట్టూ ఉన్న జీడిమామిడి తోటల్లోకి కూడా జీడిపిక్కలు ఏరుకోడానికి కొందరు వస్తుంటారు. జీడిపిక్కల సీజన్ చివర దశకు వచ్చే సమయంలో వీరు వస్తారు. పాప ఆచూకీ తెలిపితే రూ. లక్ష ఇస్తామని పోలీసుల తరఫున ప్రకటన చేశాం” అని పెద్దాపురం డీఎస్పీ చెప్పారు.

