Basara Godavari River : పిల్లల చదువుల కోసం అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి, ఆనందంగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో గోదావరి నది ఊహించని విషాదాన్ని నింపింది.
పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నదిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరాలో చోటుచేసుకుంది.
Basara Godavari River
ఒకరిని కాపాడబోయి మరొకరు.. అంతా నిమిషాల్లోనే!
హైదరాబాద్లోని కాచిగూడ చప్పల్ బజార్కు చెందిన నాగభూషణం ముగ్గురు కుమారులు చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సెల్ఫోన్ ఇయర్ఫోన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలోని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం ఉదయం రైలులో వీరంతా బాసరకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా, పెద్దకుమారుడు చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలోకి పడిపోయాడు. అది గమనించిన తమ్ముడు మల్లేశ్ కుమార్ అన్నను కాపాడేందుకు నీటిలోకి వెళ్లాడు. ఆ ఇద్దరూ మునిగిపోతుండటాన్ని చూసి, వారిని రక్షించే క్రమంలో మరో సోదరుడు రామచందర్ కూడా నదిలోకి దిగాడు. దురదృష్టవశాత్తు నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు సోదరులూ కళ్లెదుటే నీటిలో గల్లంతయ్యారు.
Basara Godavari River : పునరావృతమవుతున్న ప్రమాదాలు
బాసర గోదావరి ఘాట్ల వద్ద ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది జూన్ 14న కూడా హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు (ఇందులోనూ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు) ఇక్కడే మునిగి చనిపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారని, శాశ్వత రక్షణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, ఘాట్ల వద్ద పటిష్ట భద్రత మరియు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం లేదని స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికుల సమాచారంతో బాసర సీఐ దీపక్ ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులు గజ ఈతగాళ్లతో రంగంలోకి దిగారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ముగ్గురి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చంద్రశేఖర్, రామచందర్లకు వివాహమైంది. రామచందర్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితమే ఈ కుటుంబంలో తల్లి క్యాన్సర్తో మరణించగా, ఇప్పుడు వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్న ముగ్గురు కొడుకులు ఒకేసారి దూరమవడంతో వృద్ధ తండ్రి నాగభూషణం కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నిరుపేద కుటుంబానికి బాసరకు చెందిన స్థానిక యువకులు మానవత్వంతో స్పందించి, మృతదేహాలను హైదరాబాద్ తరలించడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

