Guntur Incident:ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత నిరంతరం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన పాలకుల ఆశయాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతోంది. ఒక సాధారణ తాగునీటి మోటార్ వివాదంలో అధికార పార్టీ నేత కుటుంబం బరితెగించి, ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తన్నిన వైనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also :Pragada Kotaiah Jayanthi: రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి
Guntur Incident: అసలు ఏం జరిగిందంటే..?
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఈ భయానక ఉదంతం వెలుగుచూసింది. కాలనీలో నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ (TDP) సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. ఈ గొడవ కాస్తా ముదరడంతో మల్లెల మూర్తి కుటుంబం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలను సైతం తోడు తెచ్చుకుని సదరు మహిళపై దాడికి దిగారు. అంతటితో ఆగక, నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసి, కాళ్లతో తంతూ చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానక సీసీటీవీ (CCTV) దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

